కల్తీ పాల ఘటనలో 15 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28 మహాప్రభ : రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 15 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే 11 మందికి వెంటిలేటర్పై వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. బాధితులకు మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు ఈరోజు(శనివారం) రాజమహేంద్రవరానికి వస్తున్నారు. కిమ్స్, అపోలో, ఏఐజీ వంటి ప్రముఖ ఆసుపత్రుల నుంచి నిపుణులు రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు.విశాఖపట్నం నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి రాజ్ సూచనల మేరకు ముంబై నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఇంజెక్షన్లతో పదిమంది బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులిటిన్లో వెల్లడైంది. పాల వ్యాపారి గణేష్ నుంచి పాలు కొనుగోలు చేసిన 110 ఇళ్లలో 302 మంది ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది సమీక్షిస్తున్నారు. ఈనెల 15న వ్యాపారి గణేశ్వరరావు సరఫరా చేసిన పాలలో ఇథలీన్ గ్లైకాల్ రసాయనం కలిసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కల్తీ పాలు తాగిన వారిలో యూరిన్ బంద్ కావడంతో అనూరియా వ్యాధి నిర్ధారణ అయింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
