ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐఈడీ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఛత్తీస్గఢ్ మే 2 ( మహాప్రభ ) : కాంకేర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐఈడీ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మావోయిస్టులు అమర్చిన మందుపాతర తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలింది. నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. అయితే, గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బృందం మైన్ల తొలగింపు ఆపరేషన్ చేస్తోంది. ఈరోజు (శనివారం) మైన్ల తొలగింపు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఐఈడీ పేలింది. దీంతో నలుగురు డీఆర్జీ జవాన్లు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ తెలిపారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయని, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత ఇది తొలి పేలుడు ఘటన అని ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు.
