వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌవుట్ పార్టీగా మారిపోయిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు..
అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌవుట్ పార్టీగా మారిపోయిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (AP Minister Payyavula Keshav) ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. సభలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్నవేసి.. చివరకు వైసీపీనే ఇరకాటంలో పడిందని సెటైర్లు గుప్పించారు. ఇవాళ (గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. వైసీపీ నేతలు అనుకున్నది తాము చెప్పాలంటే ఎలా చెబుతామని ప్రశ్నించారు. వారు అడిగిన అన్ని అంశాలనూ తాము చర్చకు పెట్టామని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్, అగ్రికల్చర్ వంటి అన్నిఅంశాలపై చర్చ పెట్టామని తేల్చిచెప్పారు.టీటీడీ లడ్డూ అంశంపై వాస్తావాలు తెలియజేయాలని.. ప్రతిపక్షం లేకపోవడంతో.. ధూళిపాళ నరేంద్ర లేఖ రాశారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. సభ నిబంధనలు, సాంప్రదాయాలు తాము పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై వైసీపీ కనీసం నోటీసు ఇవ్వలేదని ఆగ్రహించారు. సభలో రచ్చ చేయాలనేదే వాళ్ల ఉద్దేశం అని.. చర్చ జరగాలని కాదని విమర్శించారు. ప్రభుత్వం ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నామని చెప్పినా.. వారు ఎందుకు పారిపోతున్నారని దెప్పిపొడిచారు.
తమ ప్రభుత్వం వారికన్నా ముందుగానే వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని చెబుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రేపు (శుక్రవారం) అగ్రికల్చర్ మీద చర్చ చేస్తామని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటలు వరకూ కూడా కల్తీ నెయ్యిపై చర్చకు సిద్ధమని ఈరోజే చెప్పామని ప్రస్తావించారు. వైసీపీ నేడు ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి భంగపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
