పఠాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్కు అత్యధిక వార్డులు దక్కాయి.
సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 13 మహాప్రభ : పఠాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కు(Congress) ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ(BRS) జోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్కు మెజార్టీ వార్డులు దక్కలేదు. గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం అయ్యాయి. గుమ్మడిదలలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందగా, గడ్డపోతారంలో కూడా స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ విజయం సాధించింది. మిగిలిన మూడు మున్సిపాలిటీలైన ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలోనూ బీఆర్ఎస్కు అత్యధిక వార్డులు దక్కాయి.ఈ మున్సిపల్ ఎన్నికల్లో పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి చక్రం తిప్పారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరిన మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే అనుచరులు కీలక పాత్ర పోషించారు. పార్టీలో చేరకుండానే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ గెలుపునకు విస్తృతంగా కృషి చేశారు. ఆయన మద్దతుతోనే బీఆర్ఎస్ ఈ ఐదు మున్సిపాలిటీల్లో ఆధిపత్యం సాధించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
