మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ మే 13 ( మహాప్రభ ) : మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కోదాడకు చెందిన పూజారెడ్డి.. మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని.. బెటర్మెంట్ కోసం పరీక్షకు అప్లై చేసుకుంది. నేటి(బుధవారం) నుంచి ఇంటర్ బెటర్మెంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా రాత్రి హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తోటి విద్యార్థుల గమనించి వెంటనే హాస్టల్ వార్డెన్కు తెలియజేశారు. విద్యార్థిని ఆత్మహత్యపై హాస్టల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
