చిత్తూరు శివారులోని ఇరువారం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.
చిత్తూరు, ఫిబ్రవరి 13 మహాప్రభ : చిత్తూరు నగర శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఇరువారం సర్కిల్ వద్ద జరిగిన ఈ బీభత్సం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు.. కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.కారు.. కంటైనర్ కిందకు దూసుకుపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కారును కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు.
పోలీసుల దర్యాప్తు..
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఎక్కడి వారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు మలుపులు, సర్కిళ్ల వద్ద వేగాన్ని నియంత్రించాల్సి ఉందని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు కంటైనర్ల వంటి భారీ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
