మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో జగన్ రాకకోసం ఎదురు చూస్తూ వైసీపీ నేత రాంబాబు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

అమరావతి, ఫిబ్రవరి 6 మహాప్రభ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పరామర్శకు బయలుదేరారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ఇంటికి బయలుదేరారు. తాజాగా జగన్ పరామర్శ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్ను చూసేందుకు ఇబ్రహీంపట్నం వచ్చిన చిల్లకల్లు వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంబాబు మృతి చెందారు.తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్.. నాలుగు గంటలైనా ఇబ్రహీంపట్నం చేరలేదు. ఉదయం నుంచీ జగన్ కోసం పడిగాపులు కాసిన రాంబాబు పల్స్ డౌన్ కావడంతో.. ఇబ్రహీంపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద పడిపోయారు. వెంటనే గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్కు తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.కాగా, గతేడాది జూన్ లోనూ ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లిలో పర్యటించిన జగన్ కారు కిందపడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతిచెందాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ భారీగా జనాన్ని సమీకరించి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. మరోవైపు ట్రాఫిక్, పోలీసు ఆంక్షలు విస్మరిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
