ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన.. ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న రావిచెట్టు

ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన.. ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న రావిచెట్టు

📰 Generate e-Paper Clip

ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామ పొలాల్లో ఒక అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. కొద్దిరోజుల క్రితం నేలకొరిగిన ఒక రావి చెట్టు, తిరిగి తనంతట తానుగా యథాస్థానానికి చేరుకోవడం చూసి గ్రామస్థులు విస్తుపోతున్నారు.

ప్రకాశం జిల్లా మే 5 ( మహాప్రభ ) : ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. సుమారు 15 రోజుల క్రితం గ్రామంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టును గ్రామస్థులు నరికివేసినప్పటికీ, ఆ చెట్టు మొద్దు మళ్లీ పైకి లేచి నిలబడింది. దీనిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

బ్రహ్మంగారి హోమం కోసం నరికిన చెట్టు..

గ్రామస్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. కొన్నిరోజుల క్రితం ఊర్లో ఉన్న పెద్ద రావి చెట్టును నరికేశారు. కూకటి వేళ్లతో సహా పెకిలించి నేలకూల్చారు. దాని కర్రలను బ్రహ్మంగారి హోమ కార్యక్రమానికి ఉపయోగించారు. కానీ మంగళవారం ఉదయం గ్రామస్థులు గమనించినప్పుడు, నరికేసిన చెట్టు మొదలు మళ్లీ పైకి లేచి నిలబడి ఉంది. ఇది చూసి గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రజలు దీనిని దేవుడి మహిమగా పేర్కొంటూ చెట్టు వద్ద పూజలు ప్రారంభించారు. దీపాలు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు మహిళలు పూనకాలతో ఊగిపోయారు.

గ్రామస్థుల భిన్నాభిప్రాయాలు..

ఈ ఘటనపై గ్రామస్థుల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది దైవ సంకేతంగా భావిస్తుండగా, మరికొందరు ఇది సహజ ప్రక్రియలో భాగం కావచ్చని చెబుతున్నారు. మొన్న కురిసిన వర్షాల కారణంగా చెట్టు వేర్లు బలపడి ఉండవచ్చని, అందువల్ల మళ్లీ నిలబడి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మట్టి కదలికల కారణంగా గానీ.. వర్షాల ప్రభావంతో గానీ ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ వింత ఘటనను చూడటానికి స్థానికులతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!