దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఉద్ఘాటించారు.
వికారాబాద్ మే 8 ( మహాప్రభ ) : దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఉద్ఘాటించారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈరోజు (శుక్రవారం) వికారాబాద్ జిల్లాలోని కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వేంకటేశ్వర ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ పేదల తిరుపతిగా అభివృద్ధి చేస్తా..
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం చేయటం అదృష్టమని చెప్పుకొచ్చారు. తెలంగాణ పేదల తిరుపతిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ నియోజకవర్గాన్ని నందనవనంగా మార్చటానికి అందరు కలిసి రావటం అభినందనీయమని తెలిపారు. ఆగమశాస్త్ర పండితుడు సుందరవరదాచార్యులు కలలుగన్న గుడి నిర్మాణం సహకారం కావటం సంతోషమని చెప్పారు.
ఆ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తి..
తిరుపతిలో ఏ రకమైన పూజలు జరుగుతాయో ఇక్కడ అలాగే పూజలు జరుగుతాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ గుడికి కర్ణాటక, మహరాష్ట్ర నుంచి భక్తులు వస్తారని.. దీంతో కొడంగల్కు దేశంలో గుర్తింపు వస్తోందని తెలిపారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని.. అనుమతులు వచ్చాయని, ఏడాదిన్నరలోపు పూర్తి చేద్దామని చెప్పుకొచ్చారు. కృష్ణ- వికారాబాద్ రైల్వేలైన్ త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. రేకులపాడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలను ఆరు నెలల్లో ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని అన్నారు.
లగచర్ల వద్ద విద్యాహబ్..
220 ఎకరాల్లో లగచర్ల వద్ద విద్యాహబ్గా మారుస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. ఇక్కడ అనేక విద్యాసంస్దలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో ఉండాలని.. ఆ తర్వాత అందరం కలిసి పనిచేయాలని సూచించారు. 2034 వరకు గుంపులు, గ్రూపులు పక్కన పెట్టాలని.. అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. కొడంగల్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
