అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి, ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్వోను సంప్రదించారు.
అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 20 (మహాప్రభ) : అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి, ఎల్పీఎం (LPM – Land Parcel Map) జారీ చేయించుకోవడానికి వీఆర్వోను సంప్రదించారు. ఈ పని చేయడానికి వీఆర్వో శంకర్రావు రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి వీఆర్వో నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు
గతంలోనూ అవినీతి ఆరోపణలు..
వీఆర్వో శంకర్రావుకు గతంలో కూడా అవినీతి మరకలు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. గతంలోనూ అతనిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకుందని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ అతని తీరు మారలేదని అధికారులు తెలిపారు.
ఏసీబీ అధికారుల కీలక సూచనలు..
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ హర్షిణి ప్రజలకు పలు సూచనలు చేశారు: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి అవినీతిపై ఫిర్యాదు చేస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని, బాధితులు నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమేనని, అవినీతికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. భూమి సమస్యలతో సతమతమవుతున్న సామాన్య రైతులను పీడించే ఇలాంటి అధికారులపై ఏసీబీ దాడులు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
