అనంతపురం జిల్లా అగళి మండలంలోని నరసంబూది నిత్యం పూల పరిమళాలతో గుబాళిస్తుంటుంది. గ్రామ పరిధిలో 200ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు.
- 200 ఎకరాల్లో తోటలు
- బస్సు సౌకర్యం కూడా లేక రైతుల అవస్థలుఅగళి(అనంతపురం) ఏప్రిల్ 14 (మహాప్రభ) : అగళి మండలంలోని నరసంబూది నిత్యం పూల పరిమళాలతో గుబాళిస్తుంటుంది. గ్రామ పరిధిలో 200ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు. కనకాంబరం, మల్లెపూలు, కాగడాలు, చామంతి తదితర పంటలు పెట్టారు. వాటిని కుట్టి పంపుతుంటారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, బెల్గాం, కొల్హాపూర్, బెంగళూరు, శిర, తుమకూరు, అనంతపురం ప్రాంతాలకు పూలు సరఫరా చేస్తుంటారు. నిత్యం పెద్దఎత్తున పూలు తరలిస్తుంటారు. దీంతో గ్రామంలో పూల వ్యాపారమే సాగుతోంది.

పెద్దపెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు. అలాంటి గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. మార్కెట్కు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులు, బైక్లలో శిరకు తీసుకెళ్లి అక్కడి నుంచి పంపించాల్సి వస్తోందంటున్నారు. అనేకమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా.. ప్రయోజనం లేదంటున్నారు. ఇప్పటికైనా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాం
తరతరాలుగా మా కుటుంబం పూల వ్యాపారం చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తుంటాం. బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు సర్వీసు నడిపితే వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
