కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్, మార్చి 31 (మహాప్రభ) : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు మహిళ తన ఇద్దరు పిల్లలు కార్తీక్ (12), కౌశిక్ (10) లతో కలిసి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటుంది.
కుటుంబ తగాదాల కారణంగా భర్త ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. అయితే, ఇటీవలే అతను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ.. తన ఇద్దరు కొడుకులను చంపేసింది. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన స్థానికులు.. కూకట్పల్లి పీఎస్కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించి.. పోస్టోమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఇంతటి దారుణానికి పాల్పడటానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
