కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.రమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 23 మహాప్రభ : కామారెడ్డి ఎమ్మెల్యే కె.వెంకట రమణారెడ్డి(MLA Venkataramana Reddy) ఈ రోజు (సోమవారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు మూడు రోజులుగా కామారెడ్డిలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసుల బందోబస్తు నడుమ గృహ నిర్భంధంలో ఉండగా.. డాక్టర్లు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.కామారెడ్డి నియోజకవర్గంలో భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న గొడవ.. సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆరోగ్యంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు.
