అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు…

- అమెరికా సుంకాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం
- దాని ఫలితాలను మీరిప్పుడు చూస్తున్నారు
- ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ప్రకటన: కేంద్ర మంత్రి గోయల్
- అమెరికా సుంకాల తగ్గింపుపై ప్రధాని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 మహాప్రభ : అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అనుకూలమైన ఆర్థిక వాతావరణం ఏర్పడిందని, భారత్లో ప్రతి ఒక్కరూ దీనితో ప్రయోజనం పొందుతారని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ సందర్భంగా మోదీ ఈ అంశంపై మాట్లాడారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా పెద్ద నిర్ణయమన్నారు. అమెరికా టారి్ఫలపై ప్రతిపక్షం ఎంతగా విమర్శలు చేసినా, తాము ఎంతో సహనంతో వ్యవహరించామని.. ఆ సహనంతో వచ్చిన ప్రతిఫలమేమిటో ఇప్పుడు అందరికీ కనిపిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి వాణిజ్య చర్చల విషయంలో ప్రభుత్వ స్థిరమైన వైఖరి దీనితో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కానీ భారత్ మాత్రం ప్రయోజనం పొందుతోందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల క్రమం మారుతోందని, ఆ మార్పు భారత్వైపు మొగ్గుతోందని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నేతలు తొలుత ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సత్కరించారు. అమెరికా, ఈయూ, యూకే, ఒమన్ సహా 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాల ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
ఒప్పందం తుదిదశలో ఉంది: గోయల్
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ఇంకా తుదిదశలో ఉందని, ఒప్పందానికి తుదిరూపు వచ్చాక భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ చర్చలు, ఎన్నో తర్జనభర్జనల తర్వాత అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఇతర దేశాలకన్నా కూడా మంచి ఒప్పందం కుదురుతోందని.. మన దేశ వ్యవసాయ, పాడి పరిశ్రమ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పారు. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం కారణంగానే అమెరికాతో మంచి ఒప్పందం జరుగుతోందని.. భారత్పై సుంకాలు 50శాతం నుంచి 18శాతానికి తగ్గుతున్నాయని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ డీల్ విషయంలో దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, రాహుల్ గాంధీది తిరోగమన మనస్తత్వమని ఆయన మండిపడ్డారు. ట్రంప్ సుంకాల తగ్గింపు నిర్ణయం భారత్కు ఎంతో అనుకూలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు.
