హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.
నల్లగొండ మే 7 ( మహాప్రభ ) : హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) మిర్యాలగూడలో రంగనాథ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. కబ్జాలపై హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఆయా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తాము చర్యలు చేపడుతున్నామని వివరించారు.
నాలుగు వారాలపాటు ప్రజావాణిని రద్దు చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న దరఖాస్తులను పరిష్కరించడం కోసమే ప్రజావాణిని రద్దు చేశామని ప్రస్తావించారు. హైడ్రాకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కబ్జాల నుంచి సుమారుగా రూ. 85 వేల కోట్ల విలువైన భూములను కాపాడామని వెల్లడించారు. మరో ఏడాదిలో రూ.లక్ష కోట్లు విలువ చేసే భూములను తాము కాపాడుతామని స్పష్టం చేశారు. హైడ్రా పరిధిలోనే రూ.10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు తమకు సమాచారం ఉందని రంగనాథ్ పేర్కొన్నారు.
