వరంగల్ జిల్లాలో చైన్ స్నాచర్లు, పోకిరీలు రెచ్చిపోతున్నారు. నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తుల మెడలో నుంచి బంగారు గొలుసులను దొంగలు తెంచుకెళ్లడం కలకలం రేపింది.
వరంగల్ మే 12 ( మహాప్రభ ) : జిల్లాలో చైన్ స్నాచర్లు, పోకిరీల రెచ్చిపోతున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మూడు చోట్ల చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక మగవ్యక్తితో సహా ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులను దొంగలు తెంచుకెళ్లారు. ఈ సంఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరంగల్ మిల్స్ కాలనీలో పోకిరీలు హంగామా సృష్టించారు. రాత్రి సమయంలో కొందరు యువకులు బైక్లపై తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. కాలనీలోని ఓ టీ స్టాల్ యజమానిపై పోకిరీలు దాడి చేశారు.
దాడిలో టీ స్టాల్ యజమాని తీవ్రంగా గాయపడ్డాడని, అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నగరంలో పోలీసు పెట్రోలింగ్ పూర్తిగా కనిపించడం లేదని ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దొంగల బీభత్సం..
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి ఓ ఇంటి తాళాలు పగలగొట్టిన దుండగులు భారీగా బంగారు నగలు, వెండిని అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
