అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో చర్చించారు.
అమరావతి ఏప్రిల్ 8 (మహాప్రభ) : అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ వివిధ భవనాలు, ఇళ్లు, మౌళిక సదుపాయాల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ(Minister Narayana) ఈరోజు(బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పనులు వేగంగా పూర్తి చేయాలని సంస్థల అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.
అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు(రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు) కల్పించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సదుపాయాలు సకాలంలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఏజీఐసీఎల్(AGICL) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇంజినీర్లు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
