అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందని ఏపీ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాధవ్ పాల్గొన్నారు.
విజయవాడ ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఏపీ వ్యాప్తంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా పార్టీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్(PVN Madhav) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగురవేసి … నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు మాధవ్. నేటి నుంచి గ్రామపంచాయతీల్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘మన ఊరు.. మన జెండా’ పేరుతో కార్యక్రమం ప్రారంభంకానుంది.
బీజేపీ బలపడింది: మాధవ్
దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేసిందని పీవీఎన్ మాధవ్ తెలిపారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందన్నారు. పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి నుంచి సంపూర్ణ మద్దతుగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు బీజేపీ బలపడిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక శత్రు దేశాలు దాడి చేసేందుకు కూడా వెనకడుగు వేశాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కుల, మత ఘర్షణలు లేవని తెలిపారు. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదంతో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
