ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
అమరావతి, మార్చి 3 మహాప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(మంగళవారం) భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పనుల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడిక తీత అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలోనే పూడిక తీత పనులు చేపట్టి.. రైతులు పంటలు వేసేలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్ట్’ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.
