తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్ నివాళులర్పించారు.
చెన్నై,ఫిబ్రవరి 25 మహాప్రభ : తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయలలిత, చివరి వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించి ఆమె జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేశారని, రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి పీహెచ్డీ వరకు ఉచితంగా అందజేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత లబ్ధిపొందారన్నారు. అదే విధంగా మహిళలకు ఆమె అందించిన పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. 2001లో అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షోభ స్థితిలో ఉన్న సమయంలో అమ్మ తనను ముఖ్యమంత్రిగా నియమించారని, ఆరు నెలలు ఆమె బాటలోనే పదవిలో కొనసాగినట్లు తెలిపారు.

