దిండుగల్ జిల్లా, పుగలైపట్టిలో జల్లికట్టు పోటీల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోటీలో పాల్గొన్న ఓ యువకుడు ఎద్దు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 12 మహాప్రభ : జల్లికట్టు పోటీల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోటీలో పాల్గొన్న ఓ యువకుడు ఎద్దు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం దిండుగల్ జిల్లా, పుగలైపట్టిలోని సెయింట్ సందియగప్పర్, సెయింట్ సెబాస్టియన్ చర్చ్ పండుగ సందర్భంగా జల్లికట్టు పోటీలు జరిగాయి. మధురై జిల్లాకు చెందిన 24 ఏళ్ల బాలరాజు అనే యువకుడు పోటీల్లో పాల్గొన్నాడు.ఎద్దు కారణంగా బాలరాజు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడితో పాటు మరో 26 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. బాలరాజు ప్రాణాలు కోల్పోగా.. 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పుగలైపట్టిలో జరిగిన జల్లికట్టు పోటీల్లో 800 ఎద్దులు రంకెలేశాయి. 400 మంది ఆటగాళ్లు పాల్గొనగా.. 300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటైంది.
వారం క్రితం పుదుకోట్టైలో..
పుదుకోట్టై జిల్లా కులమంగలంలో జనవరి 2వ తేదీన తైపూసం ఉత్సవాల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు సమయంలో 17 ఏళ్ల చిన్నయ్య అనే బాలుడిని ఎద్దు పొడిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు పుదుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నయ్య చనిపోయాడు.
