పహల్గామ్ ఉగ్రదాడితో భారతదేశ ఐక్యతను దెబ్బతీయలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటిగా నిలుస్తోందన్నారు.
హైదరాబాద్ ఏప్రిల్ 22 (మహాప్రభ) : పహల్గామ్ ఉగ్రదాడితో భారతదేశ ఐక్యతను దెబ్బతీయలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటిగా నిలుస్తోందన్నారు. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఏకంగా 26 మందిని తుపాకులతో కాల్చి చంపారు.
ఈ సందర్భంగా అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. వీరుల త్యాగం దేశానికి శాశ్వత రుణంగా నిలుస్తోందని.. ఉగ్రకుట్రలు ఎప్పటికీ విఫలమవుతూనే ఉంటాయన్నారు. దేశ ప్రజలు అప్రమత్తంగా ఐక్యంగా ఉన్నారన్నారు సీఎం రేవంత్. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో దేశం మెుత్తం మీతోనే ఉందంటూ బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించారు. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉందన్నారు. దాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకున్నారు. దాడిలో మృతిచెందిన వారిని ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దుఃఖం, సంకల్పంలో దేశ ప్రజలమంతా ఐక్యంగా నిలబడ్డామని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం ఉగ్రవాదానికి తలొగ్గదని.. వారి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావన్నారు.
