సరదాగా షార్ట్ ఫిలిం తీసుకుందామని వెళ్లిన ముగ్గురు యువకుల ప్రయత్నం పెను విషాదంగా మారింది. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..
కడప ఏప్రిల్ 6 (మహాప్రభ) : సరదాగా షార్ట్ ఫిలిం తీసుకుందామని వెళ్లిన ముగ్గురు యువకుల ప్రయత్నం పెను విషాదంగా మారింది. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన హరిబాబు, హర్షవర్ధన్, కృష్ణ చైతన్య అనే ముగ్గురు యువకులు ఆదివారం పుష్పగిరి క్షేత్రం వద్దకు చేరుకున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో షార్ట్ ఫిలిం చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. చిత్రీకరణలో భాగంగా నీటిలోకి దిగిన వీరు, అక్కడ లోతైన మడుగును గమనించక ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు.
యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. ముగ్గురు యవకులు వేర్వేరు ప్రాంతాల వారు కావడంతో, పోలీసులు వారి కుటుంబ సభ్యలకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
