వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే మొదట సంతోషించేది తానే అని వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం, ఫిబ్రవరి 27 మహాప్రభ : వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై (YV Subbareddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో వైవీ సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని.. మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.ఒంగోలు నియోజకవర్గంలో తాను ఏడుసార్లు పోటీ చేసి.. రెండుసార్లు ఓడిపోయానని బాలినేని తెలిపారు. ఆ రెండు సార్లూ కూటమి బలంగా ఉండటం వల్లే ఓటమి పాలయ్యానని ఆయన వివరించారు. ఎన్నికల తర్వాత తాను జనసేనలో చేరానని తెలిపారు. కూటమి పార్టీలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు.వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
