మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితులు సీబీఐ కోసం కాకుండా, ముందుగా సిట్ దర్యాప్తు చేసిన వివరాలను అందజేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
కడప, మార్చి 09 మహాప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై (YS Vivekananda Reddy Case) సీబీఐ కోర్టులో ఈ రోజు(సోమవారం) విచారణ జరిగింది. నిందితులు సీబీఐకోసం కాకుండా, ముందుగా సిట్ దర్యాప్తు చేసిన వివరాలను అందజేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఇచ్చిన 13 లక్షల ఫైల్స్ను ఇండెక్స్ రూపంలో పొందుపరిచి ఇవ్వాలని నిందితులు కోర్టును కోరారు. సీబీఐ అందజేసిన 13 లక్షల డిజిటల్ ఫైల్స్లో కొన్ని ఓపెన్ అవ్వలేదని కోర్టుకు నిందితుల న్యాయవాదులు తెలిపారు. అందువల్ల సీబీఐ ఇచ్చిన ఫైల్స్ను ఇండెక్స్ రూపంలో పొందుపరిచి అందించాలని కోరారు.
కోర్ట్ సమక్షంలో ఫైళ్లు ఓపెన్ చేయాలి..
నిందితుల న్యాయవాదుల అభ్యర్థనలను న్యాయస్థానం పరిశీలించింది. ఓపెన్ కాని ఫైల్స్ను రేపు(మంగళవారం) కోర్టు సమక్షంలో ఓపెన్ చేయడానికి సీబీఐను ఆదేశించింది. ఈ కారణంగా, కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
