అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 27 (మహాప్రభ) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మోదీ పనితీరును ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అరుదైన ప్రశంస: ‘మోదీ ప్రత్యేకం’
ప్రధాని మోదీతో సంభాషణ అనంతరం ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘భారత్తో మాకున్న అద్భుతమైన సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతాయి. ప్రధాని మోదీ, నేను.. పనులు పూర్తి చేసి చూపించే వ్యక్తులం. ఇది చాలా తక్కువ మంది విషయంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది’ అంటూ ప్రధాని మోదీ నాయకత్వ పటిమను కొనియాడారు.
హోర్ముజ్ జలసంధిపై సుదీర్ఘ చర్చ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో శాంతి పునరుద్ధరణకు, జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేలా చూడాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు.ఈ చర్చపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ట్రంప్తో చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఉద్రిక్తతలు తగ్గాలని, శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. హోర్ముజ్ జలసంధి భద్రత ప్రపంచం మొత్తానికి అవసరం’ అని పేర్కొన్నారు.
ప్రపంచ శాంతిలో భారత్ పాత్ర
ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను ట్రంప్ ఐదు రోజుల పాటు వాయిదా వేసిన 24 గంటల్లోనే మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్రను అమెరికా గుర్తించినట్లు ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి.
