దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్రెడ్డి కలుస్తున్నారు.
ఢిల్లీ, ఫిబ్రవరి 13మహాప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Telangana CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలతో రేవంత్ సమావేశమవుతున్నారు. ఇవాళ(శుక్రవారం) ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని(Priyanka Gandhi) ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై చర్చ జరిగింది.
మున్సిపల్ ఎన్నికల విజయంపై హర్షం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సాధించిన విజయంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి వచ్చిన మద్దతు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయంతో పార్టీ కేడర్లో నూతన ఉత్సాహం నెలకొన్నదని, భవిష్యత్తు ఎన్నికల కోసం ఇది బలమైన పునాది అని ఆమె అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. పార్టీ శ్రేణులతో సమన్వయం, ఎన్నికల వ్యూహరచన, స్థానిక స్థాయిలో బలమైన ప్రచారం ఇవి విజయానికి దోహదపడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రియాంక గాంధీకి వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్లే పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడం, పారదర్శక పాలన అందించడం వల్ల ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు.
కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
ఈ భేటీలో తెలంగాణలో హస్తం పార్టీ బలోపేతం కావడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ శక్తిని మరింత పెంచే దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ విజయవంతమైన పాలన కొనసాగించేందుకు కేంద్ర నాయకత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచినట్లు సంకేతాలు అందుతున్నాయి. మొత్తంగా, ఢిల్లీలో జరిగిన ఈ భేటీ కాంగ్రెస్కు కొత్త ఉత్సాహాన్ని నింపినట్లుగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
