తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
మహాప్రభ -అమరావతి, జనవరి 28: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహాపాపం చేసి కూడా బుకాయించుకోవటం జగన్ కే చెల్లిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేశ్ అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంశాన్ని ప్రస్తావించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్పై ఫైర్ అయ్యారు.
పాలే లేని కల్తీ నెయ్యిని సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయటం క్షమించరాని నేరమన్నారు. వందలకోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. వైసీపీ కుట్రలను ధీటుగా తిప్పికొట్టడంతో పాటు వారి భాగోతాన్ని ప్రజల్లోనే ఎండగడదామని మంత్రులతో జరిగిన సమావేశంలో నారా లోకేశ్ సూచించారు.
కాగా..తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఇటీవల తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చార్జ్షీట్లో 36 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు రూ.235 కోట్ల విలువైన 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించారని సిట్ దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.
