తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది.
ఘటన వివరాలిలా..
చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
బాంబ్ స్క్వాడ్ నిపుణులు ఇంటి పరిసరాల్లో, లోపల పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అన్ని పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇది కేవలం తప్పుడు సమాచారమని అధికారులు స్ఫష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తు
ఈ బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి వివరాలు సేకరించేందుకు సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు ప్రజల్లో భయాందోళన సృష్టించడమే కాకుండా భద్రతా వ్యవస్థపై అనవసర ఒత్తిడి తెస్తాయని పోలీసులు హెచ్చరించారు.
భద్రతా అప్రమత్తత
ప్రముఖుల నివాసాలపై ఇలాంటి బెదిరింపులు రావడం నేపథ్యంలో చెన్నైలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఇళ్ల వద్ద అదనపు నిఘా ఏర్పాటు చేశారు. త్రిష కృష్ణన్ నివాసంపై వచ్చిన బాంబు బెదిరింపు చివరికి వదంతిగా తేలినప్పటికీ, ఈ ఘటన చెన్నైలో కొంతసేపు ఉద్రిక్తత సృష్టించింది. ప్రస్తుతం పోలీసులు నిందితులను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
