కేరళ రాష్ట్రంలో అమలు చేసిన కుటుంబశ్రీ మోడల్ను అనుసరించి.. తెలంగాణలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ పథకం ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామన్నారు.

ములుగు, ఫిబ్రవరి 6 మహాప్రభ : తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో అమలు చేసిన ‘కుటుంబశ్రీ’ మోడల్ను అనుసరించి ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. కేరళలో సర్వే ద్వారా 65 వేల మంది అత్యంత పేదలను గుర్తించి.. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణలోనూ అదే తరహాలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సర్వే చేయించి.. అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామని వివరించారు.సర్వే తర్వాత ప్రతి కుటుంబానికి వారి అవసరాలకు తగినట్లు సహాయం అందిస్తామని సీతక్క చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా చొరవ తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, శ్రీమంతుల సహకారం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కొత్త పథకం ద్వారా తెలంగాణను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
