అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.
- 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి.. ఇప్పటికీ తెలియని ఆచూకీ
దుబ్బాక(సిద్దిపేట) , ఫిబ్రవరి 27 మహాప్రభ : అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది. జిల్లా నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఒక్కరి పేరే బయటికి రావడంతో మిగిలిన వాళ్ల ఆచూకీ కోసం ఆందోళన మొదలైంది. దుబ్బాక ప్రాంతం నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిన గుండబోయిన రాము ఎక్కడ అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్వార్లోకి వెళ్లిన రాము ఆ తర్వాత అజ్ఞాత దళాలకు మిలటరీ శిక్షణ ఇస్తూ కనిపించాడని తర్వాతి కాలంలో లొంగిపోయిన నేతలు చెప్పడం.. ఆ తర్వాత ఆయన ప్రస్తావన లేకపోవడంతో స్థానికంగా ఆయన ఏమాయ్యాడు అని ఆందోళన చెందుతున్నారు.
దుబ్బాకకు చెందిన రాజకీయ నాయకుడు గుండబోయిన వెంకటేశ్వర్లు సోదరులు రాము, లక్ష్మణ్ కవలలు. ఇందులో అన్న రాముకు పీపుల్స్వార్తో సంబంధాలు ఏర్పడ్డాయి. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్గా పని చేస్తున్న రాము 1986లో ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై గళం విప్పి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన సోదరుడు లక్ష్మణ్ హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతూ అన్న ప్రభావంతో పీపుల్స్వార్ అనుబంధ ఆర్ఎస్యూ(RSU)లో పని చేశారు. కళాశాల రాజకీయాల్లో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో లక్ష్మణ్ తీవ్రంగా కలత చెందారు.

నేరుగా దుబ్బాకకు వచ్చి మల్లన్నగుట్టలో ఉరి వేసుకున్నాడు. తమ్ముడు చనిపోయిన సమయంలోనూ, ఆ తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన సమయంలోనూ రాము రాలేదు. 1989లో నల్లమల్లలో జరిగిన పార్టీ ప్లీనరీలో రాము శిక్షణ ఇస్తూ కనిపించాడని, 1999లో దుబ్బాక దళకమాండర్ బిక్షపతి అలియస్ మధుకు కూడా కనిపించాడని తర్వాతి కాలంలో వారు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత రాము ప్రస్తావన ఎక్కడా రాలేదు. పోలీసు రికార్డులో కూడా లేదు. సుమారు 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన రాము ఏమాయ్యాడని కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నాడా? లేక పార్టీ వదిలి వెళ్లారా? పార్టీలో ఏదైనా జరిగిందా అన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. రాము ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.
