నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కురబలకోట(చిత్తూరు) మార్చి 27 (మహాప్రభ) : నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని మిట్స్ యూనివర్శిటీలో రెండు రోజుల జాతీయ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్-2కె26 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.తల్లిదండ్రులు తమ పిల్లలను పక్కవారితో పోల్చి నిరుత్సాహపరచడం మానుకోవాలన్నారు. పిల్లలను ఉత్సాహపరిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఒక నిర్ధిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని సాధించడానికి కృషి చేయాలన్నారు.

అనంతరం ఆయన్ను వర్సిటీ యాజమాన్యం సన్మానించింది. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి విద్యార్థులు ఎగబడ్డారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జబర్థస్త్ టీం సద్దాం, బిందాస్ భాస్కర్, నవసందీప్, జబర్థస్ పులి తమ కామెడీతో అలరించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఛాన్సులర్ ఎన్.విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సులర్ నాదెళ్ల ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ సి.యువరాజ్ పాల్గొన్నారు.

బైకర్ చిత్రాన్ని ఆదరించండి..
- మిట్స్లో సినిమా యూనిట్ సందడి
బైకర్ చిత్రాన్ని ఆదరించాలని హీరో హీరోయిన్లు శర్వానంద్, మాళవిక నాయర్ కోరారు. గురువారం మిట్స్ యూనివర్సిటీలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ కథాంశం, విలువలతో కూడిన వినోదంతో ఈ చి త్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. అనంతరం సినిమాలోని పాటకు హీరో హీరోయిన్లతో కలిసి విద్యార్థులు డ్యాన్సు చేసి, ఆకట్టుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారు.
