కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.
కరీంనగర్, ఫిబ్రవరి 14 మహాప్రభ : కరీంనగర్లో మేయర్ పదవి (Karimnagar Mayor Election) కోసం ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘మేయర్’ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కైనట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు ఒక్కటైనట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీజేపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ కార్పొరేటర్ను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
మద్దతు కోసం ఆఫర్లు..
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు నిన్న(శుక్రవారం) రాత్రి సదరు కార్పొరేటర్తో సమావేశమయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా కార్పొరేటర్తో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇండిపెండెంట్లు, ఇతర కార్పొరేటర్లు, బీజేపీ సభ్యుల మద్దతు కోసం ఆఫర్లు ఇవ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు మేయర్గా మద్దతిస్తే ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బండి సంజయ్ రంగ ప్రవేశం..
ఈ పరిణామాలను కమలం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తమ పార్టీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేయడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా బీజేపీ అభివర్ణిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఇది ప్రజలను మోసం చేయడమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్పై కేంద్రమంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. విపక్షాల డ్రామాలను ఆధారాలతో సహా ఎండగట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. కరీంనగర్ మేయర్ పీఠం చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక నగరానికి పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా ఉన్నాయి. బండి సంజయ్ మీడియా సమావేశం తర్వాత ఈ వ్యవహారం మలుపులు తిరిగే అవకాశం ఉంది.
