ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జోష్ హేజిల్వుడ్ ఆర్సీబీ శిబిరంలో చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జోష్ హేజిల్వుడ్ ఆర్సీబీ శిబిరంలో చేరాడు. దీంతో ఆడుతాడా? లేడా? అనే అభిమానుల ఆందోళనకు, సందేహాలకు ఫుల్స్టాప్ పడింది. అతడి రాకతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలంగా మారింది. కానీ అతడు వెంటనే బరిలోకి దిగే అవకాశాలు లేవు.గాయాల నుంచి కోలుకుంటున్న హేజిల్వుడ్.. కొన్ని మ్యాచ్ల అనంతరం మైదానంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల కలకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపడంలో హేజిల్వుడ్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి సత్తా చాటాడు.
తుషారకు ఏమైంది..?
హేజిల్వుడ్ వచ్చాడన్నా ఆనందం ఓ వైపు ఉంటే.. నువాన్ తుషార లేకపోవడంతో కాస్తంతా బాధ కలిగిస్తోంది. ఆర్సీబీ ఈ సీజన్లో తుషార లేకుండానే బరిలోకి దిగనుంది. అతడికి శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసీ రాకపోవడంపై దీనికి కారణమని తెలుస్తోంది. ప్లేయర్లకు ఫిట్నెస్ లేనప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీ జారీ చేయదని సమాచారం. అయితే తుషార గాయాలపాలవ్వలేదు.. అయినప్పటికీ అతడు మ్యాచ్లు ఆడేంత ఫిట్గా లేడని వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్ 2026లో పాల్గొనాలనుకునే తమ కాంట్రాక్టు ఆటగాళ్లంతా కచ్చితంగా ఫిజికల్ టెస్ట్లో పాస్ అవ్వాల్సిందేనని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దుష్మంత చమీరా, పాతుమ్ నిశాంక, కమిండ్ మెండిస్ ఈ టెస్ట్ పాసయ్యారు. దీంతో వారికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీలు జారీ చేసింది. తుషార మాత్రం ఫిట్నెస్ ప్రమాణాలు అందుకోలేకపోయాడు.
