సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మసనం నిరాకరించింది.

ఢిల్లీ, ఫిబ్రవరి 9, మహాప్రభ: సుప్రీం కోర్టులో (Supreme Court) కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి (Kasireddy Rajasekhar Reddy) ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మసనం నిరాకరించింది. ఈ కుంభకోణంలో కసిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించారు. సుమారు రూ.750 కోట్ల కుంభకోణంలో 9 నెలలుగా జైల్లో ఉండటం పెద్ద సమయమేమీ కాదని అన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారు కసిరెడ్డి అని తెలుస్తోందని తెలిపారు.రూ.750 కోట్లు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీతో కసిరెడ్డి నేరుగా సంబంధాలున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే తమ వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కసిరెడ్డి తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వచ్చే గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టుని కసిరెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, కసిరెడ్డికి గతంలో రెగ్యులర్ బెయిల్ని ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సుప్రీంలో కసిరెడ్డి సవాలు చేశాడు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కసిరెడ్డి బెయిల్ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థలూథ్రా వాదించారు.
