లైన్మెన్ల నియామకంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండలి సభ్యులు, ఆలపాటి రాజా, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు..
అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : లైన్మెన్ల నియామకంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండలి సభ్యులు, ఆలపాటి రాజా, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (AP Minister Gottipati Ravi Kumar) సమాధానం ఇచ్చారు. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది చాలా అవసరమని తెలిపారు. క్షేత్రస్థాయి విద్యుత్ అవసరాల కోసం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్లో నియమించుకున్నామని వివరించారు. 18 వేల మంది మూడు డిస్కంల పరిధిలో వివిధ పద్ధతుల్లో నియామకమై పని చేస్తున్నారని అన్నారు.5580 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి సర్వీసులను ఉపయోగించుకుంటామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏఈల కొరతపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్నామన్నారు. ఆర్డీఎస్ఎస్ ద్వారా ఫీడర్ బైఫరికేషన్ చేసి వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ ఇస్తామని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల కోసం సుమారు రూ. 8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 70 శాతం ఆర్డీఎస్ఎస్ పనులు ఇప్పటికే పూర్తి చేశామని వివరించారు. ఏప్రిల్ నాటికి వంద శాతం ఆర్డీఎస్ఎస్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో తుఫానులను తట్టుకునేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ నిర్మిస్తున్నామని వెల్లడించారు. వరదల సమయంలో డిస్కంలకు అతీతంగా సిబ్బంది పని చేసి అంతరాయాలు లేకుండా చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
