కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు కూడా అడ్డంకులు సృష్టించడం తగదని పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 12 మహాప్రభ : కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు కూడా అడ్డంకులు సృష్టించడం తగదని పేర్కొన్నారు. పాపికొండల ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం, బోర్వెల్స్కు అనుమతులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ఇళ్లకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గిరిజనులకు నీరు, రహదారి, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఫారెస్ట్ అధికారుల తీరు వల్లే తీవ్రవాదం..
ఇప్పటికే ఉన్న రహదారిపై గ్రావెల్ లేదా మెటల్ వేయడానికి అభ్యంతరం చెప్పడమెంటనీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారుల తీరు వల్లే తీవ్రవాదం పెరిగిందని ఫైర్ అయ్యారు. ‘మీ ఆటిట్యూడ్ అబ్జెక్షనబుల్… మీపై చాలా కంప్లైంట్లు వస్తున్నాయి’ అంటూ హెచ్చరించారు. సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టర్, డీఎఫ్వో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
