mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 10:00 am Digital Edition : Namastey Mahaaprabha

TSRTC సమ్మె: నాడు డిస్మిస్.. నేడు డిస్కషన్ – చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం!

‘చర్చలు’ శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.

హైదరాబాద్ ఏప్రిల్ 22 (మహాప్రభ) : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు.. ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెబుతున్నారు.

తాజాగా, ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఒక్క రోజులో లేదా ఒక్క రౌండ్ చర్చలతో పరిష్కారం కావన్నారు. సమస్యల లోతును అర్థం చేసుకునేందుకు ఇరుపక్షాల నుంచి చర్చలు జరగాలన్నారు. గతంలో జరిగిన నష్టాన్ని పునరావృతం చేయకుండా.. కార్మికుల సంక్షేమం, సంస్థ పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.