కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి.
- తొలివిడతగా 50బస్సులు మంగళం డిపోకు రాక
తిరుపతి మార్చి 12 మహాప్రభ : కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. మంగళం 1, 2 డిపోలుగా విభజించి 50చొప్పున బస్సుల నిర్వహణ బాధ్యతలను వేర్వేరు ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. తొలివిడతగా నాలుగునెలల్లో 50 ఈకా ఎలక్ర్టిక్ బస్సులు రానున్నాయి. వీటికి పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. తాజాగా మంగళం డిపోకే మరో 50బస్సులు కేటాయించడంతో ఆ డిపో పూర్తిగా గ్రీన్ఫీల్డ్గా మారనుంది. దాంతో బస్సుల కొనుగోలు, మౌలికసదుపాయాల ఏర్పాట్లకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరిస్తాయి.

ఈ క్రమంలో మంగళం డిపో నిర్వహణ బాధ్యతల నుంచి ఆర్టీసీ పూర్తిగా విరమించుకున్నట్లే. కాగా మంగళం డిపోలో ఎలక్ట్రిక్ బస్సు రీచార్జింగ్ స్టేషన్ కోసం రూ.7.6కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ సంస్థ అండర్కేబుల్, ట్రాన్స్ఫార్మర్ వంటి పనులను మొదలుపెట్టనుంది. అదే విధంగా ప్రాంగణంలో సివిల్వర్కు, చార్జింగ్మిషన్ల అమరిక వంటి మౌలిక వసతులకు రూ.6.3కోట్లు కేటాయించారు. పనుల టెండర్ ప్రక్రియ ఈ నెల్లోనే పూర్తికానుంది. రెండో విడతలో తిరుమల డిపోకు 100, శ్రీకాళహస్తి డిపోకు 100, పుత్తూరు డిపోకు 50 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. దాంతో తిరుమలకు పూర్తిస్థాయిలో ఈవీ బస్సులే నడవనున్నాయి.