హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 మహాప్రభ : హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. చట్టాన్ని, పోలీసులను ఏమాత్రం లెక్కచేయకుండా వారు జరిపిన ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఘటన వివరాలిలా..?
కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా ఆస్పత్రి వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ అసద్ తన అనుచరులతో కలిసి ఒక షాప్ యజమానిపై కత్తితో (తల్వార్తో) దాడికి తెగబడ్డాడు. షాప్ యజమాని తన మోటార్ సైకిల్పై కూర్చుని ఉండగా, అసద్ గ్యాంగ్ ఆకస్మికంగా తల్వార్లతో విరుచుకుపడింది. దాడి చేసిన అనంతరం, వారు షాపులోని ఫ్రిడ్జ్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా షాప్ అద్దాలను కూడా పగలగొట్టి హంగామా సృష్టించారు.
పోలీసుల చర్యలు.. : ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అయితే, ఈ రౌడీషీటర్ పాత నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. రౌడీషీటర్ అసద్ ఆగడాలపై అప్పటి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు. అసద్ నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, అతనిపై రాష్ట్ర బహిష్కరణ విధించారు. రాష్ట్ర బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అసద్ పాతబస్తీలో ఎలా తిరుగుతున్నాడు..?, ఈ దాడికి గల కారణాలేమిటి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పాతబస్తీలో భయాందోళన : రౌడీషీటర్ల వరుస దాడులతో పాతబస్తీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.