mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:52 am Digital Edition : MAHAA PRABHA DAILY

హెల్మెట్‌తో కొట్టి, కత్తితో పొడిచి.. అరకులో దారుణ హత్య

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడే అరకులోయలో ఓ యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

అరకులోయ, మార్చి 25 మహాప్రభ : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడే అరకులోయలో ఓ యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. అరకులోయలో పంచాయతీ పరిధిలో ఓ రిసార్ట్స్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్ళివలస గ్రామానికి చెందిన నాగేళ్ల సురేశ్(25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు గతంలో అరకులోయలో ఓ రిసార్ట్‌లో పనిచేసేవాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రముఖ గోల్డ్ షాప్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ హత్యకు గంజాయి మత్తు, ఒక యువతి విషయంలో తలెత్తిన గొడవ ప్రధాన కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు సురేశ్‌పై అత్యంత పాశవికంగా దాడి చేశారు. తొలుత హెల్మెట్‌తో కొట్టి, ఆపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడు సురేశ్‌కు కేవలం ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం అతని భార్య గర్భవతి. చేతికి వచ్చిన కొడుకు, పెళ్లయి ఏడాది కూడా కాకముందే ఇలా శవమై పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంఘటనా స్థలానికి పాడేరు డీఎస్పీ అభిషేక్ చేరుకొని వివరాలు సేకరించారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు, పాత కక్షల కోణంలో, గంజాయి ముఠాల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.