కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో వైసీపీ రాజకీయ పరచకాలు ఆడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు.
పల్నాడు జిల్లా, ఫిబ్రవరి 21 మహాప్రభ : చిలకలూరిపేటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన సంప్రోక్షణ చర్యలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ఆలయాన్ని శుద్ధి చేశారు ప్రత్తిపాటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని మాజీ మంత్రి తీవ్రంగా విమర్శించారు. స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని.. మహా పాపమని అన్నారు.శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్నదే వైసీపీ లక్ష్యమన్నారు. మండలిలో తమకు బలం ఉందని భావించి కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని రుజువైనా కావాలనే శాసనమండలిలో రచ్చ చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించడానికే హెరిటేజ్ సంస్థను రాజకీయాల్లోకి లాగారని తెలిపారు.రాజకీయాలకు తనను వాడుకుంటున్న వారిని శ్రీవారు కచ్చితంగా శిక్షిస్తారనేది చరిత్ర ఎరిగిన సత్యమని హెచ్చరించారు. హిందూ సమాజం, శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.