శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వాకబు చేశారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను సీఎం ఆదేశించారు.
అమరావతి, ఫిబ్రవరి 25 మహాప్రభ : శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు(బుధవారం) సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో సీఎం మాట్లాడారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై సీఎం వాకబు చేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో సీరియస్ కండిషన్లో ఉండి చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితుల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు.ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని.. మరొకరికి డయాలసిస్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వారిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు సీఎం. శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు వివరించారు. పైప్లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని.. ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలియజేశారు.
రాజమహేంద్రవరం పాల ఘటన బాధితులు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్కు పంపామని… శాఖాపరంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు వెల్లడించారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.