mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 11:18 am Digital Edition : Namastey Mahaaprabha

శాసనమండలిలో నియంతలా బొత్స వ్యవహారం: పంచుమర్తి అనురాధ

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ సెషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారని మండిపడ్డారు.

అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్‌ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు అనేక నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం చెబుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. బడ్జెట్ సెషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా అడ్డుకున్నారని అనురాధ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను సమాధానం ఇవ్వనీయకుండా నియంతలా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.స్వల్పకాలిక చర్చను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించాల్సి ఉందని.. మంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి వీలు లేదని.. ముందు తామే మాట్లాడతామని వైసీపీ నేతలు పట్టుబట్టారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల ఆందోళనలతో మండలి ఛైర్మన్ సభను రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారని తెలిపారు. ప్రశ్నోత్తరాలు జరపమని ఛైర్మన్‌ను అడిగితే వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సహా మరికొందరు మీదకు వస్తున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీదకు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ వస్తుంటే మంత్రులు వెళ్ళి అడ్డుకున్నారని చీఫ్‌ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.