మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు.
గుంటూరు జిల్లా ఏప్రిల్ 11 (మహాప్రభ) : వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కన్నీటికి కారణం ఏంటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) డిమాండ్ చేశారు. గతంలో బొత్స చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కన్నీరు అంటూ ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో స్పష్టంగా చెప్పాలన్నారు. ఆ సమయంలో జగన్ రెడ్డి చేసిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు ఏమిటో ప్రజల ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు జగన్ రెడ్డికి మాత్రమే లాభదాయకంగా మారాయని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ధూళిపాళ్ల హితవుపలికారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలు, విలువల ఆధారంగా పని చేయాలని స్పష్టం చేశారు. రాజకీయాల్లో హింసాత్మక చర్యలు సరికాదని హెచ్చరించారు. వైఎస్ చనిపోయినా, వివేకా చనిపోయినా, కోడి కేసు అయినా అన్నీ జగన్ రెడ్డికి మాత్రమే లబ్ధి చేకూర్చాయని వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంసకర పోస్టులపై హైకోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.