mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 12:13 pm Digital Edition : Namastey Mahaaprabha

విజయవాడ ఉగ్రలింకుల కేసులో ముగిసిన నిందితుల కస్టడీ..

AP లో కలకలం రేపిన విజయవాడ ఉగ్రవాద సంబంధాల కేసులో ఆరుగురు నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ఐదు రోజుల పోలీస్ విచారణలో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

విజయవాడ ఏప్రిల్ 13 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన ఉగ్రవాద సంబంధాల కేసులో ఆరుగురు నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. గత ఐదు రోజులుగా పోలీసుల విచారణలో ఉన్న నిందితులను అధికారులు క్షుణ్ణంగా ప్రశ్నించి, కీలక సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం. నిందితులను ఐదు రోజుల పాటు ప్రత్యేక బృందాలు విచారించాయి. ఈ విచారణలో ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారు? ఎవరెవరిని సంప్రదిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.

ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి అందుతున్నాయి? విదేశీ లింకులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగినట్టు సమాచారం. వారి తదుపరి ప్రణాళికలు ఏమిటి? రాష్ట్రంలో ఏవైనా విచ్ఛిన్నకర చర్యలకు ప్లాన్ చేశారా? అన్న విషయాలపై పోలీసులు ప్రశ్నలు కురిపించారు. కస్టడీ గడువు ముగియడంతో, పోలీసులు నిందితులను వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి సేకరించిన ప్రాథమిక ఆధారాలను, విచారణ నివేదికను పోలీసులు న్యాయమూర్తికి సమర్పించారు.

పోలీసుల వాదనలను విన్న న్యాయస్థానం, నిందితులకు ఏప్రిల్ 20 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు వారిని తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం నిందితుల డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు) ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది.