mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:28 am Digital Edition : Namastey Mahaaprabha

వామ్మో.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే..

దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర దాదాపు రూ.14 వేల మేర పెరగ్గా వెండి ధర రూ.20 వేల మేర ఎగబాకింది.

ఇంటర్నెట్ డెస్క్ మే 13 ( మహాప్రభ ) : భారత్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ధర దాదాపు రూ.14 వేల మేర పెరగ్గా వెండి ధర కూడా రూ.20 వేల మేర ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 13) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా రూ.1,67,890కు పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర ఏకంగా రూ.13,910ల మేర ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.12,750ల మేర పెరిగి రూ.1,53,900కు చేరింది. నగరంలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.20 వేల మేర పెరిగి రూ.3.10 లక్షలకు చేరుకుంది (Gold, Silver Price Sharp On Hike May 13).

ఇతర ప్రధాన నగరాల్లోని ధరలను పరిశీలిస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర .1,68,000కు ఎగబాకింది. ఢిల్లీలో రూ.1,68,040ల వద్ద, ముంబైలో రూ.1,67,890 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,54,000కు చేరుకోగా ముంబైలో రూ.1,53,900 వద్ద, ఢిల్లీలో రూ.1,54,050 వద్ద తచ్చాడుతోంది. దేశంలో వెండి (కిలో) ధర కూడా సగటున రూ.20 వేల మేర పెరిగింది. అనేక నగరాల్లో రూ.3.10లక్షలకు చేరుకుంది. కేరళలో కిలో వెండి ఏకంగా రూ.3.3 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 4,704 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 86 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో కరెంట్ అకౌంట్‌ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం తాజాగా బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచిన విషయం తెలిసిందే.