mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 6:12 am Digital Edition : Namastey Mahaaprabha

వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ సూచీలు..

గత మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ. 8 వేల కోట్లకు పైగా విలువైన షేర్లు అమ్మేశారు. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి

ఏప్రిల్ 7 (మహాప్రభ) :గత మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ. 8 వేల కోట్లకు పైగా విలువైన షేర్లు అమ్మేశారు. అలాగే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ పశ్చిమాసియా యుద్ధం ఏ క్షణాన ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఆందోళన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).

గత సెషన్ ముగింపు (74,106)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 500 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:50 గంటల సమయంలో సెన్సెక్స్ 354 పాయింట్ల నష్టంతో 73,752 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 72 పాయింట్ల నష్టంతో 22,895 వద్ద కదలాడుతోంది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో వేదాంత, హిందోల్కా, ప్రెస్టేజ్ ఎస్టేట్, విప్రో, ఎంఫసిస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). జుబిలెంట్ ఫుడ్స్, ఫోర్స్ మోటార్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 266 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.93గా ఉంది.