mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 12:07 pm Digital Edition : MAHAA PRABHA DAILY

వరుణ్ చక్రవర్తికి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వొద్దు: క్రిష్ శ్రీకాంత్

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంఐతో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ శైలిపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 30 (మహాప్రభ) : టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 ఆదిలో అద్భుతంగా బౌలింగ్ వేసిన వరుణ్.. క్రమంగా గతి తప్పి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ అదే రీతి కొనసాగుతోంది. కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న అతడు.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ శైలిపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘బంతిని విభిన్నంగా వేయడం, లెగ్ స్పిన్ సంధించడాన్ని నేర్చుకోనంత వరకు వరుణ్ చక్రవర్తి ఇబ్బందిపడుతూనే ఉంటాడు. ఎప్పుడూ గూగ్లీలు వేయడం వర్కౌట్ అవ్వదు. బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించాలి. కొన్నిసార్లు లెగ్ స్పిన్ వేయాలి. ఇప్పుడైతే అతడి బౌలింగ్‌లో ఎలాంటి మిస్టరీ లేదు. అదంతా హిస్టరీగా మారిపోయింది. బ్యాటర్లకు కాస్త దూరంగా బంతిని విసరాలి. అప్పుడు షాట్లు కొట్టేందుకు ప్రయత్నించి వికెట్లు ఇస్తారు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లు కాస్త జంకుతారు. ఇక్కడ ఆయా జట్ల సారథులకూ ఓ మాట చెబుతున్నా. ఇప్పుడు వరుణ్‌కు పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వొద్దు. ముంబైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇలానే వరుణ్ వేసిన తొలి ఓవర్లో దూకుడుగా పరుగులు రాబట్టాడు. దాంతో వరుణ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది’ అని క్రిష్ శ్రీకాంత్ వెల్లడించాడు.