లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది..

హైదరాబాద్, ఫిబ్రవరి 4 మహాప్రభ : అవసరాల కోసం లోన్లు తీసుకుని, సమయానికి కట్టినప్పటికీ పలువురు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుంటారు. లోన్ కట్టాలని.. లేకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. దీంతో వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలయ్యారు.ముషీరాబాద్ రాంనగర్లో దారుణం జరిగింది. ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ కుమార్ (36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.3 వేల లోన్ కట్టాలని లోన్ ఏజెంట్లు తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపుతామని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ కాల్స్ చేసి బెదిరించారు. ఫోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న బాధితుడు.. ఈ వేధింపులను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.